
నిజామాబాద్ , వారధి :బండి సంజయ్ ని రాజకీయ కక్షతో, ఆయన ఎదుగుదలను ఓర్వలేక రాష్ట్రం మొత్తం పోస్టర్లు అంటించి రాక్షసానందం పొందుతున్నారని వారిని గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బిజేపి నాయకులు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ని రాజకీయంగా ఎదుర్కొలేని చేతకాని దద్దమ్మలు అర్ధరాత్రి పూట దొంగల్లా ఇందూరులో అంటించిన పోస్టర్లను బిజేపి నాయకులు చించి వేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేసు ఏదైనా సరే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అడ్డుపెట్టుకొని అతని తండ్రి ఫోటోలను పోస్టర్ల మీద ముద్రించి బండి సంజయ్ మీద బురద జల్లడమే లక్ష్యంగా పని చేశారన్నారు. బండి సంజయ్ ఎదుగుదలను ఓర్వలేని రాజకీయ చీడపురుగులు చేస్తున్న దుర్మార్గపు పోస్టర్ల ప్రచారాన్ని చించి వేసి నిరసన తెలియజేయడం జరిగిందన్నారు. ఎవరైనా నిందితుడు కనిపించకపోతే పోలీసులు ప్రకటన విడుదల చేస్తారు కానీ ఈ విధంగా గుర్తు తెలియని వ్యక్తులు ముద్దాయి తండ్రితో ఉన్న ఫోటోలను లక్షల సంఖ్యలో అంటించడం ద్వారా అతని తండ్రి వ్యక్తిత్వాన్ని బజారుకు ఈడ్చడం సబబు కాదని హెచ్చరిస్తున్నాం. కేసు కోర్టు పరిధిలో ఉన్నది న్యాయం అన్యాయం కోర్టులు తెలుస్తాయి, బండి సంజయ్ పోటోలను ముద్రించిన ఈ పోస్టర్లు అంటించిన వారిని పోలీసులు వెంటనే గుర్తించాలి దీని వెనుక ఉన్న కుట్ర దారులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ శర్మ, సుక్కరాజు, రాహుల్, రామరాజు, ప్రతాప్, సాయి ప్రసాద్, చైతన్య, యోగేష్, ఓం, అఖిల్, శీను, ఆకాష్ చోటు, సుబ్బు, అజయ్, రాజు, పవన్, రాజు తదితరులు పాల్గొన్నారు.
