Harish Rao | కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుననదని.. పంట కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ను హరీశ్‌రావు సందర్శించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. పంట కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. నారాయణఖేడ్‌, ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు సెంటర్లను ప్రారంభించలేదని.. వెంటనే కొనుగోలు సెంటర్లను ప్రారంభించి, మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మార్కెట్ యార్డ్ లను అధికారులు సందర్శించాలని సూచించారు.

చాలా చోట్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించకపోవడంతో రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకుని నష్టపోతున్నారని హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ రెడ్డి పంట మార్పిడి చేయమని చెబుతున్నారు కానీ రైతులు పంట మార్పిడి చేస్తే వాటిని కొనే దిక్కు లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం అని అన్నారు. పలు జిల్లాలలో వడగళ్ల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులకు సమయానికి రైతు బంధు ఇవ్వాలన్నారు.